నవతెలంగాణ-హైదరాబాద్: ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బుధవారం క్రికెట్ ఆడుతున్న సమయంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గాయపడ్డారు. రనౌట్ నుంచి తప్పించుకునేందుకు క్రీజులో వేగంగా పరుగెత్తే ప్రయత్నంలో అదుపుతప్పి కిందపడిపోయారు. ఆ సమయంలో శరీరం బ్యాలెన్స్ మొత్తం ఎడమ భుజంపైనే పడింది. ఈ క్రమంలో మణికట్టు వద్ద గాయమైంది.భుజం నొప్పి ఉండటంతో రఘురామకృష్ణరాజును వెంటనే మణిపాల్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. భుజం నొప్పి ఎక్కువవ్వడంతో పాటు, చేతి బొటన వేలికి గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు వెళ్లాలని వైద్యులు సూచించారు.
ఇక ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం రాత్రి నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గాయపడ్డారు. తమ జట్టుపై కూతకు వచ్చిన ఎమ్మెల్యే పార్థసారథి, ఇంకోసారి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను పట్టుకునే ప్రయత్నంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వారిపై పడ్డారు. ఈ ఘటనలో పార్థసారథి పాదం భాగంలో, శ్రీకాంత్కు భుజం వద్ద కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యాయి. బుధవారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో వీరి గాయాలను గుర్తించారు.



