నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్పై ఎక్స్ వేదికగా ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. రైతులకు వ్యతిరేకమైన యూఎస్ డీల్ పై ప్రశ్నించడం నేరమైందని, ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించడం రాజద్రోహమైందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే వ్యక్తులపై కేసులు పెట్టడం ఒక సాధారణ విషయంగా మారిందని ఆయన పేర్కొన్నారు. “నేటి భారతదేశంలో, రాజీపడిన ప్రధానమంత్రి పాలనలో, శాంతియుత నిరసన అతిపెద్ద నేరంగా మారిందని విమర్శించారు.
‘రాజ్యాంగ మార్గాల ద్వారా అధికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా మీరు మీ గొంతు పెంచితే, లాఠీలు, కేసులు, జైలు శిక్ష దాదాపు ఖాయమని, పేపర్ లీకేజీల సమస్యపై విద్యార్థులు ప్రశ్నించడం, అత్యాచార బాధితురాలికి మద్దతుగా నిలువడం, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా రెజ్లర్ల నిరసనలు, శాంతియుత ప్రదర్శనలు వంటివి అధికారంలో ఉన్న వారికి అసౌకర్యాంగా ఉంటాయని’ రాహుల్ గాంధీ అన్నారు.



