నవతెలంగాణ హైదరాబాద్: అణు ఒప్పందంపై అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు తెగబడింది. టెహ్రాన్ అంతటా పేలుళ్లు వినిపించాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పొగ వ్యాపించింది. అమెరికా సాయంతోనే ఇజ్రాయెల్ ఈ దాడులకు తెగబడినట్టు తెలుస్తోంది.
ఈ దాడిని తామే చేశామని టెల్అవీవ్ ప్రకటించింది. శత్రు దేశం నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించేందుకు ఈ దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్ కాయాన్ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ క్రమంలో టెల్అవీవ్ సైన్యం తమ దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. వైమానిక దాడులు జరిగే అవకాశం ఉన్నందున దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. టెల్అవీవ్తో సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. స్కూళ్లు, కార్యాలయాలను మూసివేయాలని ఆదేశించింది. ఈ దాడుల్లో అమెరికా హస్తం కూడా ఉన్నట్టు అధికార వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
తాజా దాడుల నేపథ్యంలో పౌర విమానాలకు ఇజ్రాయెల్ తన గగనతలాన్ని మూసివేసింది. అటు ఇరాన్, ఇరాక్లు కూడా గగనతలాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించాయి. ఇరాన్లో మొబైల్ ఫోన్ సేవలు నిలిచిపోయాయి.



