నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ అధ్యక్షుడు మరియు ఖమేనీ ఉన్నత భద్రతా సలహాదారుడు మొహమ్మద్ పాక్పౌర్, ఖమేనీ కీలక సలహాదారుడు అలీ షామ్ఖానీ కూడా అమెరికా వైమానిక దాడుల్లో మరణించినట్లు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. గతేడాది జూన్లో 12 రోజుల యుద్ధంలో ఇజ్రాయిల్ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ అధ్యక్షుడిని హత్య చేసిన అనంతరం మేజర్ జనరల్ మొహమ్మద్ ఆ బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపింది.
ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఇరాన్ పాలన కౌన్సిల్ చేతుల్లోకి వెళ్లింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా ఐఆర్ఎన్ఏ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ముగ్గురు సభ్యులతో కౌన్సిల్ను నియమించినట్లు వెల్లడించింది. ఈ కౌన్సిల్లో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, న్యాయ వ్యవస్థ అధ్యక్షుడు, గార్డియన్ కౌన్సిల్లోని ఒక జ్యూరీ సభ్యుడితో దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ కౌన్సిల్ తాత్కాలికంగా ఇరాన్ పాలనా బాధ్యతలను చూడనుంది. ఇరాన్లో సుప్రీం లీడర్ అనంతరం అత్యంత శక్తిమంతమైన విభాగాల్లో గార్డియన్ కౌన్సిల్ కూడా ఒకటి. ఈ కౌన్సిల్లో 88 మంది సభ్యులు ఉంటారు. వీరిని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని కూడా పిలుస్తారు. ఆ దేశ చట్టం ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ను ఎన్నుకునే అధికారం ఈ గార్డ్కు ఉంటుంది. ఈ ప్యానల్లో ఎనిమిదేళ్ల పదవీకాలం కోసం ఎంపికై వచ్చిన షియా మతగురువులు ఉంటారు. ఈ విభాగమే రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతను చూస్తుంది.



