నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్ రాజధాని టెహ్రాన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని ప్రఖ్యాత గాంధీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఇరు దేశాల మధ్య మొదలైన సైనిక చర్యల్లో భాగంగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనతో ఆసుపత్రి భవనం ఒకవైపు తీవ్రంగా దెబ్బతినగా, లోపల ఉన్న రోగులు, సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు.
ఈ దాడికి సంబంధించిన భీతావహ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, నవజాత శిశువుల వార్డు నుంచి నర్సులు పసిపిల్లలను ఎత్తుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న వీడియోలు అందరినీ కలచివేస్తున్నాయి. ఆసుపత్రి వార్డులన్నీ శిథిలాలు, గాజు పెంకులతో నిండిపోయాయి. వీల్ చైర్లు, వైద్య పరికరాలు ధ్వంసమై భయానక వాతావరణం నెలకొంది. కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటున్నామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతున్నప్పటికీ, ఆసుపత్రిపై దాడి జరగడం అంతర్జాతీయంగా విమర్శలకు దారితీస్తోంది. ఈ దాడికి ప్రతికారంగా ఇజ్రాయెల్లోని పలు నగరాలపై క్షిపణి దాడులు చేసేందుకు ఇరాన్ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెహ్రాన్ గగనతలం దట్టమైన నల్లటి పొగతో నిండిపోయి, యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.



