నవతెలంగాణ-హైదరాబాద్ : పోలవరం జిల్లా, గంగవరం మండలం కుసుమరాయి గ్రామ పరిసరాల్లో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. పులి కదలికల నేపథ్యంలో అటవీ శాఖ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ఇప్పటికే పులి జాడ కనుగొనేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు పనిచేస్తుండగా, పరిస్థితిని మరింత నిశితంగా సమీక్షించేందుకు శ్రీశైలం నుంచి మరో నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నట్లు అటవీ శాఖ అధికారి సుబ్బారెడ్డి వెల్లడించారు.
పులి సంచారం దృష్ట్యా గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లేవారు, ఒంటరిగా బయట తిరిగేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ నేతృత్వంలో ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పులి జాడను గుర్తించేందుకు నిరంతర నిఘా కొనసాగుతోందని, ప్రజలు ఆందోళన చెందవద్దని, అధికారులకు సహకరించాలని కోరారు.



