నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అదనపు సుంకాలతో రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ తగ్గించిన విషయం తెలిసిందే. ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషణ కొనసాగిస్తుంది. తాజాగా పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు ఎగుమతులపై ప్రభావం పడింది. అంతేకాకుండా అమెరికా, ఇజ్రాయిల్లను దెబ్బతీయడానికి ఇరాన్ వ్యూహాత్మకంగా హర్మూజ్ జలసంధిని మూసివేశామని, ఆ జలసంధి గుండా నౌకలు వస్తే పేల్చివేస్తామని ఇరాన్ దళాలు గట్టిగా హెచ్చరించాయి.
ఈ ఉద్రిక్తతలు భారత్లోని చమురు నిల్వలపై టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ పట్ల రష్యా తన స్నేహాన్ని మరోసారి ప్రదర్శించింది. యుద్ధం ముదిరి గల్ఫ్ దేశాల నుంచి ముడిచమురు సరఫరాలో ఆటంకాలు ఎదురైతే భారత్ కు అవసరమైన అదనపు ఇంధనాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా భరోసా ఇచ్చింది.
ప్రస్తుతం యుద్ధం కారణంగా స్వల్పకాలికంగా ఇంధనాల సరఫరాలో ఆటంకాలేర్పడినా భారత్కు ఇబ్బందేమీ లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపారు. మన దగ్గర 6-8 వారాల డిమాండ్ కు సరిపడే పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాల నిల్వలు ఉన్నాయని వివరించాయి.



