నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గురువారం సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్ డాక్టర్ సి.వి. ఆనంద బోస్ తన పదవికి రాజీనామా చేశారు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్ భవన్ వర్గాల సమాచారం మేరకు ఆయన తన రాజీనామా లేఖను సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే, రాజీనామాకు గల కచ్చితమైన కారణాలను ఆయన అధికారికంగా వెల్లడించలేదు.
2022లో పశ్చిమ బెంగాల్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన ఆనంద బోస్, రాష్ట్రంలోని మమతా బెనర్జీ ప్రభుత్వంతో పలు సందర్భాల్లో విభేదించారు. ముఖ్యంగా యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియ, బడ్జెట్ సమావేశాల సమయంలో ప్రసంగం మధ్యలో ఆగిపోవడం వంటి ఘటనలు అప్పట్లో దుమారం రేపాయి. తాజాగా ఎలక్టోరల్ రోల్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) విషయంలోనూ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వంతో దూరాన్ని పెంచాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, గవర్నర్ రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కొత్త గవర్నర్గా ఎవరు రానున్నారు, ఎన్నికల సమయంలో రాజ్ భవన్ పాత్ర ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆనంద బోస్ రాజీనామా ఆమోదం పొందిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దీనిపై అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.



