నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న భీకరయుద్ధ ప్రభావం మన ఇంటిని తాకింది. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ఇక్కడ గ్యాస్ నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా డొమిస్టక్ సిలిండర్ల బుకింగ్ గడువును పెంచింది. అదే విధంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను కోత పెట్టింది. మోడీ సర్కార్ నిర్ణయంతో చిరు వ్యాపారుల నుంచి బడబడా హోటల్స్ నిర్వహకుల వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ వ్యాపారాలు దెబ్బతీంటాయని, జీవనోపాధి కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ముంబై, బెంగళూరులో కొన్ని హోటల్స్ గ్యాస్ కొరత కారణంగా మూసివేశారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్లో సైతం మరో రెండు రోజుల్లో రాబోతున్నదని హోటల్ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.
యుద్ధం కారణంగా ఆందోళన చెందుతున్న వినియోగదారులను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు మరింత భయపెడుతున్నాయి. ఇప్పటికే గృహ వినియోగ సిలిండర్ ధర రూ.60 పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆంక్షలు విధిస్తున్నది. గ్యాస్ బుకింగ్ మధ్య గడువును 25 రోజులకు పెంచింది. కస్టమర్ ఈరోజు గ్యాస్ బుక్ చేసుకుంటే, మళ్లీ 25 రోజుల తర్వాతే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికితోడు గ్యాస్ డెలివరీ సమయంలోనే ఓటీపీ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది. గృహ వినియోగాలకు ఉపయోగించే గ్యాస్ పక్కదారి పట్టకుండా ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.



