నవతెలంగాణ-హైదరాబాద్: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం సహా పలు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) నిర్వహిస్తున్న ‘జన ఆక్రోశ్ ర్యాలీ’ మంగళవారం రామ్లీలా మైదానంలో ప్రారంభమైంది. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, గ్యాస్, ఇంధన కొరతతో పాటు ఇతర సమస్యలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు.ఈ ర్యాలీలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబి, లోక్సభ ఎంపి అమ్రారామ్, అశోక్ధావలే, తపన్ సేన్ సహా పలువురు పొలిట్బ్యూరో సభ్యులు ప్రసంగించనున్నారు.
పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా తలెత్తిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ ఆర్థిక పరిస్థితులపై చూపే ప్రభావాన్ని ప్రశ్నిస్తున్నారు. పెరుగుతున్న ఆహార ధరలు దేశవ్యాప్తంగా జీవనోపాధులను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని, కొత్తగా అమల్లోకి వచ్చిన విబి-గ్రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ చట్టాన్ని సవరించకూడదని, డిస్కమ్ల ప్రైవేటీకరణను చేపట్టకూడదని, అలాగే విత్తన చట్టాన్ని సవరణను కూడా వ్యతిరేకిస్తున్నారు.
ఫిబ్రవరి 27 నుండి మార్చి 20 మధ్య జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్ మరియు జార్ఖండ్తో సహా పలు రాష్ట్రాల్లో నిర్వహించిన 33 జన ఆక్రోశ్ జాతాలు రామ్ లీలా మైదానంలో భారీ ర్యాలీ చేపట్టనున్నాయి.



