నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్ మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ అరెస్ట్ అయ్యారు. శనివారం ఉదయం భక్తాపూర్లోని గుండులో ఉన్న ఆయన నివాసం నుంచి నేపాల్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్ను కూడా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. దేశంలో కొత్తగా ఎన్నికైన యువ ప్రధాని, మాజీ రాపర్ బాలేంద్ర షా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోపే ఈ పరిణామం చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన ‘జెన్ జీ’ నిరసనల సమయంలో చోటుచేసుకున్న హింస, మరణాలకు సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. ఆ నిరసనల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది యువకులతో సహా 70 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. తాజాగా, ఈ ఘటనపై విచారణ జరిపిన ‘గౌరీ బహదూర్ కార్కీ కమిషన్’, అప్పటి ప్రధాని ఓలీ, హోంమంత్రి రమేష్ లేఖక్లు హింసకు కారకులని తేల్చింది. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసింది. దీంతో ఇవాళ వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ అరెస్టును ఓలికి చెందిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్టు – లెనినిస్ట్) (సిపిఎన్- యుఎంఎల్) సభ్యుడు రఘుజీ పంత్ తీవ్రంగా ఖండించారు. దర్యాప్తు కమిటీ ఇచ్చిన నివేదికలో ఓలీ హింసకు పాల్పడ్డారని సరైన ఆధారాలు లేవు. ఈ నివేదిక కేవలం వారు ఓలి అరెస్టు చేయాలనే ఉద్దేశంతోనే తయారు చేశారని అన్నారు.
కాగా, మాజీ విదేశాంగ మంత్రి, ఆ పార్టీ నేత అయిన ప్రదీప్ గ్యావాలి మాట్లాడుతూ.. ‘ఇది మా ఛైర్మన్పై తీసుకున్న రాజకీయ ప్రతీకారం’ అని అన్నారు. ఓలి అరెస్టు అనంతరం సిపిఎన్-ఎఎంఎల్ అత్యవసర సెక్రటేరియట్ సమావేశానికి పిలుపునిచ్చింది.



