– శతాధిక బాలల సమ్మేళనానికి దక్కిన గౌరవం
నవతెలంగాణ – అశ్వారావుపేట
భానూదయ సాహిత్య సంస్థ,మండల విద్యాశాఖ అశ్వారావుపేట వారు సంయుక్తంగా ఇటీవల నిర్వహించిన శతాధిక బాల కవి సమ్మేళనం లో విద్యార్ధులు చదివిన కవితలన్నిటినీ ప్రముఖ సాహితీవేత్త సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు సంపాదకత్వంలో “కలికలు” పేరుతో సంకలనంగా తీసుకొస్తున్నారు. అయితే ఈ పుస్తకాన్ని ముద్రణకు ముందుగానే భారత ప్రభుత్వ ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ ఆధీనంలో నిర్వహించబడుతున్న రాజా రామ్ మోహన రాయ్ ఐ.యస్.బి.ఎన్ ఏజన్సీ కి పరిశీలన కోసం పంపగా వారు చిన్నారుల కవితలతో కూడిన కలికలు సంకలనాన్ని పరిశీలించి అంతర్జాతీయ ప్రామాణికత కోడ్ ను కేటాయించి ఇ మెయిల్ ద్వారా ప్రభాకరాచార్యులు కు లేఖను పంపారు.
దీనితో ఈ సంకలనానికి అంతర్జాతీయ ప్రామాణిక గ్రంధంగా గుర్తింపు లభించింది. ఐ.ఎస్.బి.ఎన్ ఏజన్సీ జ్యూరీ మెంబర్స్ కు ప్రభాకరాచార్యులు కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్ధులు వ్రాసిన కవితా సంకలనానికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల యం.ఇ.ఒ ప్రసాదరావు, కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు,కవి, జర్నలిస్ట్ మడిపల్లి వెంకటేశ్వరరావు,ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.



