నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల దేశవ్యాప్తంగా స్కూళ్లు, ఆఫీసులు, కోర్టులకు వేల సంఖ్యలో బాంబు బెదిరింపులు(Bomb Threats) వచ్చిన విషయం తెలిసిందే. సుమారు 1100 సార్లు నకిలీ బాంబు బెదిరింపులకు పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నాటకలోని మైసూరులో అతన్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని 47 ఏళ్ల శ్రీనివాస్ లూయిస్గా గుర్తించారు. కిరాయి ఉంటున్న ఇంటి నుంచి అతన్ని శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ, స్థానిక పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు, అసెంబ్లీ, విద్యా సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు వందల సంఖ్యలో బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
నిందితుడు లూయిస్ బెంగుళూరుకు చెందిన వ్యక్తి. అతను పీజీ విద్యను అభ్యసించాడు. ప్రస్తుతం అతను నిరుద్యోగి. అతని తల్లి ఓ రిటైర్డ్ ఉద్యోగి. ఆమెతో కలిసి అతను జీవిస్తున్నాడు. నిందితుడు మానసికంగా వత్తిడిలో ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 1100 బెదిరింపు మెసేజ్లు చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ఈమెయిల్స్తో పాటు ఇతర కమ్యునికేషన్ పద్ధతుల్లో ఆ మెసేజ్లు చేసినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. బాంబు బెదిరింపుల ఘటనలో.. పలు రాష్ట్రాలు అనేక కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.



