నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సీఈఓగా బ్రిటీష్ ఎయిర్వేస్ మాజీ చీఫ్ విలియం వాల్ష్ నియమితులయ్యారు. పీటర్ ఎల్బర్స్ ఆకస్మిక రాజీనామా చేసిన కొన్ని వారాల తర్వాత, ఇండిగో కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను నియమించింది. ”శ్రీ వాల్ష్ (ఈయన ‘విల్లీ’గా సుప్రసిద్ధులు) ప్రస్తుతం IATA (అంతర్జాతీయ విమాన రవాణా సంఘం) డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన బ్రిటిష్ ఎయిర్వేస్, IAG (ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ గ్రూప్ -Aer Lingus, British Airways, Iberia, Level, Vueling సంస్థలను కలిగి ఉన్న ఒక హోల్డింగ్ కంపెనీ) సంస్థలకు CEO గా పనిచేశారు,” అని IndiGo నుండి వెలువడిన అధికారిక ప్రకటన పేర్కొంది. ”విల్లీ ఇండిగో సారథ్యం వహించనున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఆయన పలు విమానయాన సంస్థలలో అద్భుతమైన నాయకత్వ ట్రాక్ రికార్డ్ కలిగిన ఒక విశిష్టమైన ప్రపంచ విమానయాన నాయకుడు.
భారీ స్థాయి విమానయాన కార్యకలాపాలను నిర్వహించడంలో, సంక్లిష్టమైన మార్కెట్ డైనమిక్స్ను ఎదుర్కోవడంలో ఆయనకున్న అనుభవం, నిరంతరం మారుతున్న, పోటీతత్వంతో కూడిన అంతర్జాతీయ విమానయాన వాతావరణంలో ఇండిగోను బలోపేతం చేయడానికి, నిరంతర వృద్ధికి నాయకత్వం వహించడానికి ఆయన్ను అత్యంత అనువైన వ్యక్తిగా నిలుపుతుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో ఒకటైన ఈ రంగంలో ఇండిగో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న తరుణంలో, ఆయన నియామకం ఇండిగోకు ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది,” అని ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా అన్నారు.



