నవతెలంగాణ హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా విమాన ఇంధన ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండిగో సంస్థ విమాన టికెట్ల ధరలు పెంచింది. దూరాన్ని బట్టి డొమెస్టిక్ ఫ్లైట్స్లో రూ.275 నుంచి రూ.950, ఇంటర్నేషనల్ సర్వీసులలో రూ.900 నుంచి రూ.10వేలు వరకు ఫ్యూయల్ ఛార్జెస్ పెరుగుతాయని పేర్కొంది. ఈ కారణంగా దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణ ఛార్జీలు భారీగా పెరిగి ప్రయాణికులపై భారం పడనుంది.ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు సవరించిన రోజునే ఇండిగో నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.
‘‘గత నెల రోజుల్లో ఏటీఎఫ్ ధరలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయి. దీనివల్ల విమానయాన సంస్థ నిర్వహణ వ్యయాలపై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. ఇంధన ధరల పెరుగుదలను పూర్తిగా భర్తీ చేయడానికి విమాన ప్రయాణ ఛార్జీలను భారీగా సవరించాల్సి ఉంటుంది. ప్రయాణికులపై పడే ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని స్వల్ప మొత్తంలో వినియోగదారులకు బదిలీ చేశాం. ఏప్రిల్ 2వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయి’’ అని ఇండిగో పేర్కొంది.



