- అర్ధాంతరంగా ముగిసిన అనంతారం గ్రామసభ
- మధ్యలోనే వెళ్ళిపోయిన సర్పంచ్ అనూష
నవతెలంగాణ-అశ్వారావుపేట: మండలంలోని ఆనంతారం గ్రామసభ అర్ధాంతరంగా ముగిసింది.సమస్యలపై ప్రజలు నిలదీయటంతో రసాభసగా మారింది.కనీసం సర్పంచ్ చెప్పినా అధికారులు వినకపోవటంతో ఆమె మధ్యలోనే వెళ్ళిపోయారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అనంతారం పంచాయితీ కార్యాలయంలో అధికారులు గురువారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక గ్రామసభ నిర్వహించారు.ముందుగా కార్యదర్శి విజయలక్ష్మీ ప్రగతి ప్రణాళిక నివేదికను చదివి వినిపించారు. తర్వాత ఫోటోలు తీసుకుంటూ అప్లోడ్ చేయటంలో నిమగ్నమైన కార్యదర్శిని ప్రజలు నిలదీశారు.సమస్యలు వినకుండా ఫోటోలు తీసుకోవటానికి పిలిచారా అంటూ.మండిపడ్డారు. సర్పంచ్ అనూష దేవి కి సమస్యలు వివరించగా నమోదు చేసుకోవాలని కార్యదర్శికి సూచించారు.
ఆమె ఫోటోలు అప్లోడ్ చేసుకుంటూ పట్టించుకోకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.నేను చెప్పినా వినిపించుకోనప్పుడు మీరే గ్రామసభ పెట్టుకోండి అంటూ మద్యలోనే వెళ్ళిపోయారు. అనంతరం ఇసుక,బందెల దొడ్డి వంటి సమస్యలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మద్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.ఒక దశలో బీఆర్ఎస్ – కాంగ్రెస్ శ్రేణులు బాహాబాహీకి దిగారు. బీఆర్ఎస్ నాయకుల ప్రతిఘటించటం లో అక్కడ నుండి వెళ్ళిపోయారు. నిర్ణీత సమయానికి ముందే గ్రామసభ ముగిసిపోయింది. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కార్యదర్శి ఫోన్లో నిమగ్నమయ్యారని, చెప్పినా వినిపించుకోలేదని, అందుకే గ్రామసభ నుండి వెళ్ళిపోయినట్లు సర్పంచ్ అనూష దేవి తెలిపారు. ఈ విషయమై ప్రజలు అందరూ ఒకే సారి సమస్యలను సభ దృష్టికి తీసుకురావటంతో కొంత గందరగోళం నెలకొందని కార్యదర్శి విజయలక్ష్మి తెలిపారు. ప్రజల నుండి వచ్చిన సమస్యలను సేకరించామని సమాదానం చెప్పారు.



