- డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్.
నవతెలంగాణ-రాయపోల్: ప్రజా ఉద్యమాలకు తన జీవితాన్నే అంకితం చేసిన ప్రజా కళాకారుడు తుర్కపల్లి జహంగీర్ అకాల మరణం సమాజానికి తీరని లోటని డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్, రజక సంఘం రాష్ట్ర నాయకులు ముత్యాల నర్సింలు, సోషల్ రిఫార్మేషన్ కోశాధికారి మహమ్మద్ ఉమర్, పుట్ట రాజు అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ప్రజా కళాకారుడు మహమ్మద్ జహంగీర్ పార్తివదేహానికి నివాళి అర్పించారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం తన కళను ఆయుధంగా మలుచుకుని జీవితాంతం పోరాడిన అరుదైన వ్యక్తిత్వం జహంగీర్ దని కొనియాడారు.దోపిడి, పీడనలేని సమసమాజ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకుని తన ఆటపాటల ద్వారా ప్రజల్లో చైతన్యం రగిలించిన మహోన్నత కళాకారుడు జాంగిర్ అని ఆయన గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను వెలికి తీసి, వాటి పరిష్కారానికి కళారూపాల ద్వారా అవగాహన కల్పించడంలో ఆయన చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు.
నిత్య నిర్బంధ పరిస్థితులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ప్రజల గొంతుకగా నిలిచి, అన్యాయాలకు వ్యతిరేకంగా గళమెత్తిన ధైర్యవంతుడు జహంగీర్ అని అన్నారు. ముఖ్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో గజ్వేల్ ప్రాంతంలో ఆయన పోషించిన పాత్ర అత్యంత కీలకమైందని, ఉద్యమానికి ఊపిరి పోసేలా పనిచేశాడని తెలిపారు. జహంగీర్ ఆత్మీయతకు మారుపేరుగా నిలిచాడని, ఎవరైనా సహాయం కోరితే ముందుండే సహజ స్వభావం ఆయనదని స్మరించుకున్నారు. ఆయన మృతి కేవలం ఒక కళాకారుడి కోల్పోవడం మాత్రమే కాకుండా, ప్రజా ఉద్యమాలకు అంకితమైన గొంతుకను కోల్పోవడమని పేర్కొన్నారు. జహంగీర్ మృతి పట్ల ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబానికి సమాజమంతా అండగా ఉండాలని పేర్కొన్నారు.



