నవతెలంగాణ-హైదరాబాద్ : పొరుగు దేశం పాకిస్థాన్లో ఇంధన ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలపై అక్కడి ప్రభుత్వం పెట్రో భారం మోపింది. పెట్రోల్, డీజిల్ ధరలను రికార్డు స్థాయిలో పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు శుక్రవారం, ఏప్రిల్ 3 నుంచి తక్షణమే అమల్లోకి వచ్చాయి.
తాజా పెంపుతో లీటర్ హై-స్పీడ్ డీజిల్ ధర ఏకంగా రూ. 184.49 (54.9 శాతం) పెరిగి రూ. 520.35కు చేరింది. అదేవిధంగా, పెట్రోల్ ధర లీటర్పై రూ. 137.23 (42.7 శాతం) పెరిగి రూ. 458.40కు ఎగబాకింది. నెల రోజుల వ్యవధిలో పాకిస్థాన్లో ఇంధన ధరలు పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయని, ఈ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయక తప్పడం లేదని పాక్ ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్, పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ గురువారం రాత్రి మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. “అంతర్జాతీయ ధరల భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయక తప్పదు, అయితే బలహీన వర్గాలపై ప్రభావాన్ని తగ్గించడానికి ఉపశమన చర్యలను తీసుకుంటాము” అని ఆర్థిక మంత్రి ఔరంగజేబ్ పేర్కొన్నారు.
భారీ పెంపు నుంచి సామాన్యులకు కొంత ఊరట కల్పించేందుకు ప్రభుత్వం లక్షిత సబ్సిడీలను ప్రకటించింది. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనదారులకు మూడు నెలల పాటు నెలకు 20 లీటర్ల వరకు లీటర్పై రూ. 100 సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో పాటు చిన్న రైతులు, ప్రజా రవాణా వాహనాలకు కూడా ఉపశమన చర్యలు ప్రకటించింది.



