నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు మరోసారి భారీ జరిమానా పడింది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో శుక్రవారం చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ విజయం సాధించినప్పటికీ, స్లో ఓవర్ రేట్ కారణంగా అయ్యర్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలింది. ఈ సీజన్లో అయ్యర్ స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడటం ఇది వరుసగా రెండోసారి కావడంతో ఐపీఎల్ పాలకమండలి కఠినమైన శిక్ష విధించింది.
చెన్నైతో మ్యాచ్ అనంతరం ఐపీఎల్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయడంలో విఫలమైంది. ఇది ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం రెండో తప్పిదం కావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు రూ. 24 లక్షల జరిమానా విధించారు. గతంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లోనూ అయ్యర్కు ఇదే కారణంతో రూ. 12 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.
ఈసారి శిక్ష కేవలం కెప్టెన్కే పరిమితం కాలేదు. తుది జట్టులోని సభ్యులతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్కు కూడా జరిమానా విధించారు. జట్టులోని మిగతా ఆటగాళ్లందరికీ రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం.. ఏది తక్కువైతే అంతమేర కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు స్పష్టం చేశారు. దీంతో చెన్నైపై సాధించిన అద్భుత విజయం ఆనందం పంజాబ్ జట్టుకు పూర్తి స్థాయిలో దక్కకుండా పోయింది.



