నవతెలంగాణ-హైదరాబాద్ : పల్నాడు జిల్లాలోని మాచర్ల టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) తురక వెంకటరమణ సస్పెన్షన్కు గురయ్యారు. సంచలనం సృష్టించిన చౌడమ్మ హత్య కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు, కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆయనపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే, కులాంతర వివాహం చేసుకుందనే కారణంతో కన్నతండ్రే కడతేర్చిన కామనబోయిన చౌడమ్మ (21) హత్య కేసులో సీఐ వెంకటరమణ పాత్రపై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమయ్యాయి. మార్చి 18న జరిగిన ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆయన ప్రయత్నించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
అంతకుముందు, బాధితురాలి ఆచూకీ కనుగొన్న సీఐ, ఆమె తండ్రి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని యువతిని ఆయనకు అప్పగించారని కూడా ప్రచారం జరిగింది. ఈ ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపిన ఉన్నతాధికారులు, సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.



