నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్లో అమెరికా చేపట్టిన అత్యంత కీలకమైన రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, సోర్స్ను వెల్లడించని రిపోర్టర్లను జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఇరాన్లో చేపట్టిన ఈ హై-రిస్క్ ఆపరేషన్లో ఒక అమెరికా సైనికుడిని రక్షించగా, మరొకరు ఇంకా గల్లంతయ్యారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ లీక్ వల్ల ఇరాన్ అధికారులు అప్రమత్తమయ్యారని, దీంతో గల్లంతైన సైనికుడితో పాటు అతడిని వెతకడానికి వెళ్లిన వందలాది మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని ట్రంప్ ఆరోపించారు. “ఈ లీక్ కారణంగా ఇరాన్ దేశం మొత్తానికీ విషయం తెలిసిపోయింది” అని ఆయన అన్నారు. ఈ సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తిని ‘అనారోగ్య వ్యక్తి’గా అభివర్ణించిన ట్రంప్.. ఆ వార్త రాసిన జర్నలిస్ట్ సోర్స్ పేరు చెప్పకపోతే జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. “ఆధారాన్ని అప్పగించండి లేదా జైలుకు వెళ్లండి” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ లీక్పై వైట్హౌస్ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిందని తెలిసింది.
మీడియాకు ట్రంప్ తీవ్ర హెచ్చరిక..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



