నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి పనామా కాలువ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పసిఫిక్ మహాసముద్ర ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ప్రఖ్యాత ‘బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్’ కింద జలాల్లో ప్రయాణిస్తున్న ఒక ఇంధన ట్యాంకర్ పేలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, అగ్నికీలలతో నిండిపోయింది. ఈ ఘటనతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. వంతెనపై వాహనాల రాకపోకలు కొనసాగుతుండగా కాలువలో వెళుతున్న ఫ్యూయల్ ట్యాంకర్ షిప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో ఆకాశాన్ని తాకేలా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు భయపడిన వాహనదారులు తమ కార్లను వేగంగా నడుపుకుంటూ బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ దుర్ఘటనలో ఇద్దరు పౌరులు, మంటలను ఆర్పేందుకు యత్నించిన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. మరో వ్యక్తి గల్లంతైనట్లు సమాచారం అందడంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమీపంలోని ఇతర ఇంధన ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా నిరంతరం నీటిని చల్లుతూ పెను ప్రమాదాన్ని నివారించారు.



