నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణాన్ని ముగించే లక్ష్యంతో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చలు విఫలమయ్యాయి. ఒప్పందం కుదరకపోవడంతో ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. అమెరికా తన అహేతుకమైన డిమాండ్ల వల్లే చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొందని ఇరాన్ ఆరోపించగా, తమ షరతులను ఇరాన్ అంగీకరించలేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ వైఫల్యంపై ఇరాన్ ప్రభుత్వ మీడియా ఐఆర్ఐబీ ఒక ప్రకటన విడుదల చేసింది. “ఇరాన్ ప్రజల జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు మా ప్రతినిధి బృందం 21 గంటల పాటు నిరంతరాయంగా చర్చలు జరిపింది. మేం ఎన్నో ప్రతిపాదనలు చేసినప్పటికీ, అమెరికా పక్షం నుంచి వచ్చిన అహేతుకమైన డిమాండ్లు చర్చల పురోగతిని అడ్డుకున్నాయి. అందుకే చర్చలు ముగిశాయి” అని ఆ ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చల అనంతరం మీడియాతో మాట్లాడారు. తాము “చివరి, ఉత్తమ ఆఫర్”తో ఇస్లామాబాద్ నుంచి వెనుదిరుగుతున్నామని తెలిపారు. “ఇరాన్ దానిని అంగీకరిస్తుందో లేదో చూద్దాం” అని ఆయన వ్యాఖ్యానించారు. అణ్వాయుధాలను నిర్మించకూడదన్న తమ కీలక షరతును ఇరాన్ అంగీకరించలేదని, అందుకే ఒప్పందం కుదరలేదని వాన్స్ వివరించారు. “ఒప్పందం కుదరకపోవడం ఇరుపక్షాలకు చెడ్డ వార్తే. కానీ ఇది అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ నష్టం కలిగిస్తుంది. మా రెడ్ లైన్స్ ఏంటో చాలా స్పష్టంగా చెప్పాం” అని ఆయన పేర్కొన్నారు.



