నవతెలంగాణ-హైదరాబాద్: నోయిడాలో జీతాలు పెంచాలని కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన (Noida Workers Protest) హింసాత్మకంగా మారింది. వేతనాలు పెంచాలని నోయిడా పారిశ్రామికవాడ లో మూడ్రోజులుగా నిరసన చేస్తున్న కార్మికులంతా నేడు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. పలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. పలు వాహనాలకు నిప్పుపెట్టగా.. మరికొన్నింటిని ధ్వంసం చేశారు. వేలాది మంది కార్మికులు వీధులు, రహదారులపైకి వచ్చి న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు.కార్మికుల ఆందోళనలతో నోయిడాలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నోయిడా ఫేజ్-2 ప్రాంతంలో ముఖ్యంగా సెక్టార్ 1, సెక్టార్ 84లో ఆందోళనలు తీవ్రంగా జరుగుతున్నాయి.
మరోవైపు జీతాల పెంపు డిమాండ్లను పరిష్కరిస్తామని జిల్లా అధికారులు, పారిశ్రామిక శాఖ అధికారులు ఆదివారమే చెప్పినప్పటికీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హింసను నివారించేందుకు క్షేత్రస్థాయిలో కార్మికులతో సంప్రదింపులు జరుపుతున్నామని అధికారులు చెబుతున్నారు.



