నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై నిన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటనను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ క్యాంప్ ఆఫీస్పై దాడి చేయడం హేయమైన చర్య.. ఇది రాజకీయం కాదు.. ప్రజాస్వామ్యంపై దాడి” అని అన్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేయాలని, ప్రత్యర్థులపై నిర్మాణాత్మక విమర్శలు చేయాలి తప్ప దాడులు, హింసకు పాల్పడటం ప్రజాస్వామ్య సంస్కృతి కాదని అన్నారు. మారణాయుధాలతో క్యాంప్ కార్యాలయంపై దాడి చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా వేదిక అని, భువనగిరిలో ఇలాంటి దాడుల సంస్కృతి గతంలో ఎన్నడూ లేదన్నారు.
ఢిల్లీ నుంచి అమిత్ షా డైరెక్షన్లో బండి సంజయ్, బీజేపీ నాయకులు గుండా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.“ఇన్ని రోజులు మేము సంయమనం పాటించాం.. మా ఓపికను బలహీనతగా భావించొద్దు. హద్దులు దాటితే ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే గట్టిగా సమాధానం చెబుతాం” అని హెచ్చరించారు.
ఇటీవల నల్గొండలో మంత్రి ఇంటిపై జరిగిన దాడిని కూడా ప్రస్తావిస్తూ, బీజేపీ హింసాత్మక రాజకీయాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. “చెప్పేది రాముడి పేరు.. చేసేది రావణకాండ” అన్న రీతిలో బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు.
నిన్నటి ఘటన అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించారని, ఈరోజు క్యాంప్ కార్యాలయాన్ని గోపంచకంతో శుద్ధి చేశామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హింసకు ఎప్పటికీ తలొగ్గదని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్పై కూడా ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “తెలంగాణలో 1000 రోజుల దగా” అంటూ బీఆర్ఎస్ మరో కొత్త రాజకీయ నాటకానికి తెరతీసిందని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే అబద్ధాలు, అసత్య ప్రచారాలను మానుకోవాలని సూచించారు.
గత ప్రభుత్వ పాలనలో జరిగిన వైఫల్యాలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని, ప్రజా సమస్యలపై చర్చించకుండా రాజకీయ నాటకాలు చేయడం సరికాదన్నారు.
కేసీఆర్ ఒక్కరోజు కూడా అసెంబ్లీకి హాజరుకాకుండా ప్రజా సమస్యలకు దూరంగా ఉండటం సరికాదని విమర్శించారు. ప్రజల కోసం పని చేయని కేసీఆర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
“అబద్ధాలకు అడ్రస్ అంటేనే బీఆర్ఎస్” అని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మక విమర్శలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, అయితే హింస, దాడులు, బెదిరింపులను మాత్రం సహించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి–రవికుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి, పట్టణ కౌన్సిలర్లు, పి ఏ సి ఎస్ చైర్మన్లు పకీర్ కొండల్ రెడ్డి, జీలుగు సతీష్ పవన్, డైరెక్టర్స్,పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, ఎల్లంల జంగయ్య యాదవ్, కో-ఆప్షన్ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, డీసీసీ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ అనుబంధ విభాగాల నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.



