నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూకశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు మారణోమానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 28మంది టూరిష్టులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అయితే ఈ పరిణామాలను తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం పాక్ దౌత్యపర అంశాలపై కీలక తీసుకుంది. అత్యవసరంగా మంత్రివర్గం భేటీ అయి..ఇరుదేశాల సరిహద్దు ప్రాంత పోస్ట్ అత్తారితో పాటు పలు చెక్ పోస్టులను మూసివేశారు. ఇండియాలోని పాక్ దేశ టూరిస్టులను 48గంటల్లోనే దేశ విడిచివెళ్లిపోవాలని హూకం జారీ చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు కేంద్ర మంత్రివర్గం తెలిపింది. ఈ హఠాత్తు పరిణామాలతో మరోసారి సింధు జలాల ఒప్పందం తెరపైకి వచ్చింది.
సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ , పాకిస్థాన్ల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై 1960 సెప్టెంబరులో నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ఖాన్ సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం సింధు ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి. వీటి సగటు వార్షిక ప్రవాహం 33 మిలియన్ ఎకరాల అడుగులు (ఎమ్ఏఎఫ్)గా ఉంది. సింధు నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్లపై పాకిస్థాన్కు హక్కులు దక్కాయి. వీటి సామర్థ్యం 135 ఎమ్ఏఎఫ్గా ఉంది. ఈ నదీ జలాల వినియోగ సమాచారాన్ని పంచుకోవడానికి ఒప్పందం కింద ఓ సహకార యంత్రాంగాన్ని నెలకొల్పారు. ఈ విషయంలో రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు ‘శాశ్వత సింధు కమిషన్ (పీఐసీ)’ను ఏర్పాటుచేశారు. దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా ఉన్నారు. ఒప్పందం అమలు గురించి ఏటా సమావేశాలు జరుగుతాయి. ఈ దాడి జరగముందు కూడా ఈ ఒప్పందాన్ని పునర్ సమీక్షించాలని పలుమార్లు పాక్ దేశానికి భారత్ నోటీసులు కూడా పంపింది. అయినా కానీ దాయాది దేశం ఇంతవరకు ఉలుకుపలుకు లేకుండా మిన్నకుండిపోయింది. తాజా పరిణామంతో సింధు ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ఇండియా స్ఫష్టం చేసింది.