లక్నో: సౌదీ అరేబియా నుంచి హజ్ యాత్రికులు సహా 250మంది ప్రయాణికులతో వెళుతున్న విమానం సాంకేతిక సమస్య కారణంగా ఆదివారం లక్నోలో ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఎడమ టైర్ నుండి పొగలు వెలువడినట్లు అధికారులు తెలిపారు. హైడ్రాలిక్ వ్యవస్థలో లోపం కారణంగా టైర్లో లోపం ఏర్పడివుండవచ్చని అన్నారు. వివరాల ప్రకారం.. ఎయిర్ బస్ ఎ330-343 విమానం జెడ్డాలో రాత్రి 10.45 గంటలకు బయలుదేరి ఉదయం 6.50 గంటలకు లక్నోలోని అమౌసీ విమానాశ్రయంలో దిగింది. రన్వేపై దిగిన తర్వాత టాక్సీవే పైకి వస్తుండగా ఎడమ టైర్ నుండి నిప్పురవ్వలు, దట్టమైన పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు సమాచారం అందించారు. సిబ్బంది 20నిమిషాల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విమానం రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఎడమ టైర్ పనిచేయకపోవడంతో మంటలు వచ్చినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అన్నారు. మరో ఘటనలో ఆదివారం హైదరాబాద్ వెళుతున్న లుఫ్తాన్స విమానం బాంబు బెదిరింపులతో ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో దిగినట్టు అధికారులు తెలిపారు. ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం..మధ్యాహ్నం 2.14గంటలకు జర్మన్ నుంచి బయలుదేరిన బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్లో ల్యాండ్ అయ్యేందుకు అనుమతి లభించకపోవడంతో వెనక్కు మళ్లినట్టు లుఫ్తాన్స వార్తా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.