నవతెలంగాణ-హైదరాబాద్ : భారత క్రికెట్ రంగంలో విషాదం నెలకొంది. సీనియర్ క్రికెటర్, భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి (77) లండన్లో సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దిలీప్ దోషి కొన్ని దశాబ్దాలుగా బ్రిటన్ రాజధాని లండన్లోనే నివసిస్తున్నారు. ఆయనకు భార్య కళిందీ, కుమారుడు నయన్ (మాజీ క్రికెటర్, సర్రే మరియు సౌరాష్ట్ర జట్లకు ప్రాతినిధ్యం వహించారు), కుమార్తె విశాఖ ఉన్నారు.
దిలీప్ దోషి మృతి పట్ల బీసీసీఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. “మాజీ భారత స్పిన్నర్ దిలీప్ దోషి లండన్లో మరణించడం చాలా విచారకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి” అని బీసీసీఐ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పేర్కొంది.
1947 డిసెంబర్ 22న అప్పటి రాజ్కోట్ సంస్థానంలో జన్మించిన దిలీప్ దోషి, తన అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్కు పేరుపొందారు. 30 ఏళ్ల వయసులో 1979 సెప్టెంబర్ 11న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ, తనదైన ముద్ర వేశారు. 1979 నుంచి 1983 మధ్య కాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
33 టెస్టు మ్యాచ్లు, 15 వన్డేలు ఆడారు. టెస్టు క్రికెట్లో 30.71 సగటుతో మొత్తం 114 వికెట్లు పడగొట్టారు. ఇందులో ఆరు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం విశేషం. ఆలస్యంగా కెరీర్ ప్రారంభించినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో గణనీయమైన ప్రభావాన్ని చూపిన కొద్దిమంది భారత బౌలర్లలో దిలీప్ దోషి ఒకరిగా నిలిచిపోయారు. అనతికాలంలోనే భారత బౌలింగ్ దళంలో నమ్మకమైన బౌలర్గా ఆయన స్థిరపడ్డారు.