నవతెలంగాణ-హైదరాబాద్: ఈ ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఈసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా ఆరాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కోసం బూత్ స్థాయి ఏజెంట్ల (బిఎల్ఎ)ను పెంచాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) బుధవారం ఆదేశించింది. తర్వాత ఆందోళనలు లేవనెత్తకుండా ముందుగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రణాళిక ప్రకారం సజావుగా కొనసాగుతోందని, 2025 జూన్ 24న జారీ చేసిన ఆదేశాలను పాటిస్తోందని ఇసి పేర్కొంది. ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి రాజకీయ పార్టీలతో నేడు జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఇసి వర్గాలు తెలిపాయి.
భారీ కసరత్తులో సుమారు లక్షమంది శిక్షణ పొందిన బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓ) 243 మంది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, 38 జిల్లా, ఎన్నికల అధికారులు, 9 డివిజన్ల కమిషనర్లు బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి సమన్వయంతో లక్షమంది వాలంటీర్లు పాల్గంటారు. ఇసిఐ ద్వారా నమోదు చేయబడిన మరియు గుర్తింపుపొందిన జాతీయ, రాష్ట్రీయ రాజకీయ పార్టీలు ఇప్పటికే పోలింగ్ స్టేషన్లలో 1.5లక్షలకు పైగా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకున్నప్పటికీ, పార్టీలు అదనపు బిఎల్ఎలను నియమించడానికి సమయం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. తర్వాత ఫిర్యాదు చేయడం కన్నా ముందుగానే ఎక్కువ మంది బిఎల్ఎలను నియమించాలని ఇసి వర్గాలు తెలిపాయి.