నవతెలంగాణ-హైదరాబాద్ : బెంగళూరు ఎయిర్పోర్ట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం మరికాసేపట్లో టేకాఫ్ అవుతుందనంగా కాక్పిట్లో పైలట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన సిబ్బంది పైలట్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI2414 బెంగళూరు ఎయిర్పోర్ట్లో సిద్ధంగా ఉంది. టేకాఫ్కు కొద్దిసేపటి ముందు పైలట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన సిబ్బంది పైలట్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పైలట్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు.
ఈ ఘటనతో ఇవాళ తెల్లవారుజామున ఢిల్లీకి రావాల్సిన విమానం ఆలస్యమైంది. ఎయిర్లైన్స్ కాక్పిట్ సిబ్బందిలోని మరో సభ్యుడు పైలట్ బాధ్యతలు తీసుకున్నట్లు సదరు అధికారి తెలిపారు. ‘జులై 4న తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకోవాల్సి ఎయిర్ ఇండియా విమానం ఆలస్యమైంది. మా పైలట్లలో ఒకరికి వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. వెంటనే అతడిని స్థానికి ఆసుపత్రికి తరలించాం. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. వైద్యలు పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది’ అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.