నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో బీబీ కా అలం ఊరేగింపు ఘనంగా జరిగింది. షియా ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కత్తులు, బ్లేడ్లతో శరీరాన్ని గాయపరుచుకుని రక్తం చిందిస్తూ సంతాపం తెలిపారు. చార్మినార్ వద్ద బీబీ కా అలం ఊరేగింపును చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
మొహర్రం సందర్భంగా డబీల్పూరాలోని బీబీ కా అలం నుండి ప్రారంభమైన అంబారి ఊరేగింపు అలీజా కోట్ల, చార్మినార్, గుల్జార్ హౌస్, పంజేశా, మీర్ ఆలం మండి, పత్తర్గట్టి, మదీనా, దారుల్షిఫా మీదుగా చాదర్ఘాట్ వద్ద ముగిసింది.
మొహమ్మద్ ప్రవక్త మనవడు హుసైన్ ఆత్మత్యాగానికి గుర్తుగా జరుపుకునే మొహర్రం సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలోని డబీల్పురా ప్రాంతంలో బీబీ కా అలావాలో సంతాప దినాలు ఊరేగింపుతో ముగిశాయి.
ఊరేగింపులో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సౌత్ జోన్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబారి చుట్టూ సౌత్ జోన్ పోలీస్ స్పెషల్ టీమ్ ఆధ్వర్యంలో మూడు అంచెల భద్రత కల్పించారు.