అమెరికా ఒత్తిడికి మోడీ ప్రభుత్వం లొంగితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు చెప్పారు. అమెరికాతో వ్యాపార ఒప్పందం కోసం భారత్ చర్చలు జరుపుతున్నదని తెలిపారు. తక్కువ సుంకాలతో దిగుమతి చేసుకోవాలంటూ అమెరికా భారత్పై ఒత్తిడి చేస్తున్నదని వివరించారు. అమెరికా, ఐరోపా నుంచి పాలు, పాల పదార్థాలను దిగుమతి చేసుకుంటే తెలంగాణలో పాడి పరిశ్రమ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. కార్ల దిగుమతి
అంగీకరిస్తే ఏపీలో కియా కార్ల ఉత్పత్తి జరుగుతున్నదనీ, దానిపై ఆ ప్రభావం పడుతుందని చెప్పారు. ఫార్మా పరిశ్రమలపై అమెరికా నియంత్రణ పెరుగుతున్నదనీ, దానివల్ల ఆ రంగం తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. దీనిలో హైదరాబాద్ ఫార్మారంగానికి ఎలాంటి మినహాయింపు లేదన్నారు. ఇలాంటి ప్రజావ్యతిరేక విధాన నిర్ణయాలపై సీఎం రేవంత్రెడ్డి దృష్టిసారించాలనీ, కేంద్రంపై ఒత్తిడి పెంచుతూ లేఖలు రాయాలని సూచించారు. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని ఓట్లను తొలగిస్తున్నారనీ, దీనివల్ల త్వరలో తెలంగాణలోనూ సమస్యలు వస్తాయని హెచ్చరించారు. ఎస్ఐఆర్లో అన్ని డాక్యుమెంట్లనూ అంగీకరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలో కూడా పనిగంటలు పెంచుతూ 282 జీవో తెచ్చారనీ, దీన్ని రేవంత్సర్కార్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అమెరికాకు లొంగితే తెలంగాణకు అన్యాయం : రాఘవులు
- Advertisement -
- Advertisement -