బోర్డు తిప్పేసిన డిజిటల్ మైక్రో ఫైనాన్స్
300 మందికిపైగా బాధితులు
ఆదిలాబాద్లో కార్యాలయానికి తాళం
ఆందోళన వ్యక్తం చేసిన బాధితులు
నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్
ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకొని డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. మోసపోయామని గ్రహించిన బాధితులు బుధవారం కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా కార్యాలయం మూసేసి ఉంది. ఇంద్రవెల్లి మండలం శంకర్గూడకు చెందిన కృష్ణ పట్టణంలోని రాంనగర్ కాలనీలో ఇటీవల డిజిటల్ మెక్రో ఫైనాన్స్ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు ఆశ చూపాడు. అయితే డ్రెస్ కోడ్ కోసం రూ.20వేలు ఇవ్వాల్సి ఉంటుందని, అది వేతనంలో జమ చేస్తామని నమ్మించారు. ఇది నమ్మిన దాదాపు 300మందికిపైగా రూ.20వేల చొప్పున కట్టారు. అయితే, మొదటి నెల వేతనం రాకపోయే సరికి నిర్వాహకులను నిలదీశారు. మంగళవారం సాయంత్రం డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు. తీరా బుధవారం వచ్చి చూస్తే కార్యాలయానికి తాళం వేసి ఉంది. సంబంధిత వ్యక్తుల ఫోన్లు స్వీచ్ ఆఫ్ వస్తున్నాయి.
దీంతో మోసపోయామని గమనించి బాధితులు తమకు న్యాయం చేయాలని కార్యాలయం ఎదుట బుధవారం బైటాయించారు. రెండు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా స్పందించడం లేదని వాపోయారు. ఆదిలాబాద్తో పాటు ఉట్నూర్, జైనూర్లో మొత్తం మూడు బ్రాంచ్లను ఏర్పాటు చేశారు. కృష్ణ ఇటీవల రిమ్స్కు కోటి రూపాయలతో పరికరాలు పంపిణీ చేస్తామని ప్రకటన కూడా చేశాడు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. మైక్రో ఫైనాన్స్ కంపెనీ ప్రారంభోత్సవానికి ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రముఖులు వచ్చారన్నారు. అది నమ్మి మోసం జరగదనే దీమాతో ఉద్యోగం కోసం డబ్బులు కట్టామన్నారు. కృష్ణ అనే వ్యక్తి వెడ్మ ఫౌండేషన్ పేరిట సామాజిక సేవ కొనసాగిస్తున్నారని తెలిసిందన్నారు. అదే నమ్మకంతో తాము డ్రెస్ కోడ్ కోసం రూ.20వేలు చెల్లించామని తెలిపారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని కోరారు. రూ.20వేల కంటే ఎక్కువ ఇస్తే మంచి పొజీషన్ ఉన్న జాబ్ ఇస్తామని చెప్పినట్టు చెప్పారు. అలా కొందరు రూ.20వేల నుంచి రూ.30వేల, మరికొందరు రూ.40వేలు కూడా చెల్లించామని వాపోయారు.
ఉద్యోగాల పేరిట మోసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES