నవతెలంగాణ-హైదరాబాద్: “కేంద్రంతో చర్చలు జరుపకుంటే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి?” అని ప్రశ్నించారు సీఎం. రాష్ట్రానికి సంబంధించి పలు ముఖ్యమైన అంశాలను ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చించామని తెలిపారు. ఇండియా, పాకిస్తాన్ మధ్యే నీటి పంపిణీపై చర్చలు జరుగుతుంటే, నేను పక్క రాష్ట్రం సీఎంతో మాట్లాడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశాల అనంతరం మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. తన పాలనపై విమర్శలు చేసే ప్రత్యర్థులపై సూటిగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై ఘాటైన పదజాలంతో ప్రస్తావించారు.
బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ ఎలాంటి చర్చలు జరగలేదని ప్రకటించిందని సీఎం తెలిపారు. అయితే, తాను ఇప్పటికే మూడు సమస్యలను పరిష్కరించానని పేర్కొన్నారు. మిగిలిన సమస్యలపై అధికారులు, సాంకేతిక నిపుణుల కమిటీ చర్చిస్తుందని వివరించారు. “నేను ఇంజనీర్ కాదు… సాంకేతిక అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటాం” అని పేర్కొన్నారు.
“ప్రజలు నాకు అధికారం ఇచ్చారు.. రాష్ట్ర సమస్యలను కేంద్రానికి తీసుకెళ్లడం నా బాధ్యత” అని సీఎం స్పష్టం చేశారు. ఢిల్లీకి కాకుండా ఫామ్ హౌస్కు వెళ్తే సమస్యలు పరిష్కారం కావు అని పరోక్షంగా కేసీఆర్పై విమర్శలు చేశారు. నెలకు ఖచ్చితంగా రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకుంటానని హామీ ఇచ్చారు.
ప్రతిపక్ష నేత కేసీఆర్తో అసెంబ్లీలో చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. “కేటీఆర్ నాయకత్వాన్ని చెల్లెలే అంగీకరించడం లేదు. గతంలో సవాల్ విసిరితే పారిపోయారు” అంటూ తీవ్ర విమర్శలు చేశారు. “గంజాయి బ్యాచ్కి నేను భయపడను. భయపడి ఉంటే నేను రేవంత్ రెడ్డి అవుతానా?” అంటూ విరుచుకుపడ్డారు.
బీసీ రిజర్వేషన్లపై మా వ్యూహం మాకుందని, కేటీఆర్ డ్రగ్స్ కేసుపై, గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతుందన్నారు. విలన్లు క్లైమాక్స్ లోనే అరెస్ట్ అవుతారని, కేటీఆర్ లోకేష్ ల మీటింగ్ సంగతేంటని ఆయన ప్రశ్నించారు. కిషన్ రెడ్డికి బీసీ రిజర్వేషన్లపై సవాల్ విసిరిన రేవంత్.. ఫోన్ టైపింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో కలిసి పని చేస్తామని, కేసీఆర్ సభకు రావాలన్నారు.
తనపై ఉన్న కేసులపై హడావుడి చేయడం లేదని, చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు. “నేను హడావుడి చేస్తే మళ్లీ మీడియానే ప్రశ్నిస్తుంది” అంటూ గళమెత్తారు. బీజేపీ సీబీఐ కేసుల పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు.
రెండేళ్ల తర్వాత కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టులను మళ్లీ భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. ప్రస్తుతం 65 కార్పొరేషన్లను రెండేళ్ల పదవీకాలంతో నియమించామని తెలిపారు.