నవతెలంగాణ – హైదరాబాద్: వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ భారత్ లో కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించేందుకు ‘హైప్’ అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా 500,000 కంటే తక్కువ సబ్స్క్రయిబర్లు ఉన్న ఛానెళ్లకు ఎక్కువ రీచ్ లభిస్తుంది. భారతదేశంలో 50 కోట్లకు పైగా యూట్యూబ్ వినియోగదారులు ఉన్న నేపథ్యంలో, ఈ ఫీచర్ చిన్న క్రియేటర్లకు తమ కంటెంట్ను విస్తృత స్థాయిలో, ఎక్కువమంది ప్రేక్షకులకు చేరవేసే అవకాశం కల్పిస్తుంది.
‘హైప్’ ఫీచర్లో భాగంగా, క్రియేటర్లు తమ వీడియోలను ‘హైప్’ చేయడానికి వినియోగదారులు ఓటు వేయవచ్చు. ఈ ఓట్ల ఆధారంగా యూట్యూబ్ అల్గారిథమ్ ఆ వీడియోలను ఎక్కువ మందికి సిఫార్సు చేస్తుంది. ఈ ఫీచర్లో పాల్గొనే ఛానెళ్లు కమ్యూనిటీ గైడ్లైన్స్ను పాటించాలి… అంతేగాకుండా వారి వీడియోలు ఒరిజినల్ కంటెంట్తో ఉండాలి. ఈ విధానం ద్వారా చిన్న క్రియేటర్లు అల్గారిథమ్లో దాగిపోకుండా, తమ పనిని ప్రదర్శించే అవకాశం పొందుతారు.
ఈ ఫీచర్ భారతదేశంలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. ఎందుకంటే భారత్ యూట్యూబ్కు అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. ఇక్కడి క్రియేటర్లు విభిన్న సంస్కృతులు, భాషలు, ఆసక్తులను ప్రతిబింబించే కంటెంట్ను రూపొందిస్తున్నారు. ఉదాహరణకు, యషి టాంక్ వంటి క్రియేటర్లు యూట్యూబ్ను ఉపయోగించి తమ వ్యాపారాన్ని 30 లక్షల మంది సబ్స్క్రయిబర్లతో విస్తరించారు. అలాగే, ఊర్మిళా నింబాల్కర్ వంటి క్రియేటర్లు తమ ఛానెళ్ల ద్వారా జీవనశైలి, విద్య కంటెంట్తో 9 లక్షల మంది సబ్స్క్రయిబర్లను సంపాదించారు.