నవతెలంగాణ-హైదరాబాద్: బ్రిక్స్ కూటమి సభ్యదేశాలపై మరోసారి యూఎస్ అధ్యక్షుడు తన మేకపోతు గంభీర్యాని ప్రదర్శించారు. డీడాలరైజేషన్ కు పాల్పడితే ఆ కూటమి దేశాలపై 10శాతం అదనపు సుంకాలు విధిస్తామని బీరాలు పలికారు. క్రిప్టో కరెన్సీ చట్టబద్ధతకు సంబంధించిన ‘జీనియస్’ బిల్లుపై సంతకం చేసిన ట్రంప్.. అనంతరం వైట్హౌస్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘బ్రిక్స్ (BRICS) అనే ఓ చిన్న గ్రూప్ ఉంది. అది చాలా వేగంగా తన ఉనికిని కోల్పోతోంది. వారిని మేం చాలా బలంగా కొట్టాం. డాలర్ ఆధిపత్యాన్ని నియంత్రించాలని వారు చూస్తున్నారు. మా కరెన్సీ ప్రమాణాన్ని అధిగమించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే వారిపై టారిఫ్లు విధిస్తామని ప్రకటించాం’’ అని ట్రంప్ వెల్లడించారు. డాలర్ విలువ తగ్గడాన్ని మేం ఎన్నటికీ అంగీకరించబోం. మా కరెన్సీ స్టేటస్ పడిపోతే.. దాన్ని మేం ఓటమిగానే భావిస్తాం’’ అని ట్రంప్ స్పష్టం చేశారు.
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో పాటు ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేసియా తదితర దేశాలు బ్రిక్స్ కూటమి ఏర్పడ్డాయి. ఇటీవల బ్రెజిల్ వేదికగా జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ ఏకపక్ష సుంకాల పెంపుపై ఈ దేశాలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.ఈక్రమంలో మరోసారి ట్రంప్ బ్రిక్స్ కూటమి అదనపు టారిఫ్లు విధిస్తామని ప్రగల్భాలు పలికారు.