నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్రమంత్రి, ఎల్జేపీ (రాంవిలాస్) పార్టీ అధినేత చిరాగ్ పాసవాన్ అన్నారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. నీతీశ్ ప్రభుత్వానికి మద్దతిచ్చినందుకు చింతిస్తున్నానని అన్నారు. తాజాగా బిహార్లో పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థిని స్పృహతప్పి పడిపోగా.. అంబులెన్స్లో ఆమెపై అత్యాచారం జరిగిన ఘటన దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై చిరాగ్ స్పందిస్తూ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ‘‘నేరస్థుల ముందు బిహార్ యంత్రాంగం తేలిపోతోంది. హత్యలు, దోపిడీలు, కిడ్నాప్లు, అత్యాచారాలు నిరంతరం జరుగుతున్నాయి. ఈ నేరాలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అనిపిస్తోంది. క్రైమ్ రేటును ప్రభుత్వం తగ్గించలేకపోతోంది. బిహార్లో ప్రజలు సురక్షితంగా ఉండలేకపోతున్నారు. ప్రజలను రక్షించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు అసంతృప్తిగా ఉంది. ఇకనైనా ప్రభుత్వం మేలుకోవాల్సిన సమయం వచ్చింది. నేరాల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలి’’ అని చిరాగ్ పాసవాన్ విమర్శించారు.
ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈసీ ఓటరు సమగ్ర సవరణ సర్వే చేపట్టింది. దీన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.