నవతెలంగాణ-హైదరాబాద్ : ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండా మారింది. శ్రీశైల ప్రాజెక్టు నుంచి 93,127 క్యూసెక్కుల వరద సాగర్కు వచ్చి చేరుతుతున్నది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతోపాటు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో క్రస్టు గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మంగళవారం ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
కాగా, సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 583.8 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులో గరిష్ఠంగా 312.05 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పుడు 293.97 టీఎంసీల నీరు ఉన్నది. మరో 18 టీఎంసీల నీరు వస్తే నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుతుంది.
ఇక శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాంలోకి జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1.27 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 1.40 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.4 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 201.12 టీఎంసీలు నీరు ఉంది.