– ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
– ముగ్గురు మృతి – మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
విశాఖపట్నం : విశాఖలో ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి వెల్డింగ్ షాపులోని వస్తువులు చెల్లాచెదురయ్యాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రజలు ఉలిక్కిపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని ఫిషింగ్ హార్బర్ నేవల్ క్యాంటీన్కు వెళ్లే మార్గంలో హిమాలయ బార్ పక్కన ఉన్న గ్యాస్ వెల్డింగ్ షాపులో గురువారం సాయంత్రం ఆక్సిజన్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో వెల్డింగ్ షాప్ యజమాని చల్లా గణేష్ (45), బుక్కా వీధికి చెందిన శ్రీను (32) అక్కడికక్కడే మరణించారు. బుక్కా వీధికి చెందిన సిహెచ్.ముత్యాలు, మధురవాడ మిథిలాపురి కాలనీకి చెందిన ఎర్ర ఎల్లాజీ , ఆరిలోవ రాజీవ్నగర్కు చెందిన టి.సన్యాసిరావు, ఎవిఎన్ కాలేజీ సమీపంలోని చెంగళరావుపేటకు చెందిన ఇప్పిలి రంగారావు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కెజిహెచ్ కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిహెచ్. ముత్యాలు మరణించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. హార్బర్లోని బోట్లకు ఇక్కడ వెల్డింగ్ పనులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలియగానే ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కెజిహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వారితో పాటు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియో చెల్లించాలని ఎపి మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
విశాఖలో పేలిన గ్యాస్ సిలిండర్
- Advertisement -
- Advertisement -