పునరాలోచనలో ట్రంప్
వాషింగ్టన్ : రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్న చైనాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అదనపు సుంకం విధిస్తారా? భారత్పై ట్రంప్ అదనపు సుంకం విధించిన తర్వాత తరచుగా ఎదురవుతున్న ప్రశ్న ఇది. రష్యా నుంచి చమురును కొనుగో లు చేస్తోందన్న కారణంతో భారత్పై విధించినట్లుగానే చైనాపై కూడా అదనపు సుంకాన్ని విధించే విషయంలో ట్రంప్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చైనాతో తమ సంబంధాలు విస్తృతమైనవని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. అమెరికా-చైనా సంబంధాల స్వభావం క్లిష్టమైనదని ఆయన చెప్పారు. ‘చైనాపై అదనపు సుంకాన్ని విధించే విషయాన్ని పరిశీలిస్తున్నానని ట్రంప్ అన్నారు. అయితే ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని వాన్స్ ఫాక్స్ న్యూస్కు తెలిపారు. అమెరికా-చైనా సంబంధాలను రష్యాతో ముడిపెట్టలేమని వాన్స్ చెప్పారు. ట్రంప్ అనేక అవకాశాలను పరిశీలిస్తున్నారనీ, తన విచక్షణతో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ‘చైనాతో సంబంధాలకు సంబంధించిన అంశం కొంత క్లిష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మా సంబంధాలు అనేక ఇతర అంశాలపై కూడా ప్రభావం చూపుతాయి. రష్యా పరిస్థితితో వాటికి సంబంధమే లేదు’ అని వివరించారు. కాగా రష్యా నుంచి చైనా గత నెలలో 10 బిలియన్ డాలర్ల విలువైన చమురును కొనుగోలు చేసింది. గత మార్చి నుంచి జరుపుతున్న కొనుగోళ్లలో ఇదే అధికం. అయితే గత సంవత్సరంతో పోలిస్తే మార్చి-జూలై నెలల మధ్య కొనుగోళ్లు 7.7 శాతం తగ్గాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు సమర్ధనీయమేనని చైనా స్పష్టం చేసింది. ‘రష్యా సహా ప్రపంచ దేశాలన్నింటితోనూ సాధారణ ఆర్థిక, వాణిజ్య, ఇంధన సహకారాన్ని నెలకొల్పుకునే చట్టబద్ధమైన హక్కు చైనాకు ఉంది. మా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సహేతుకమైన ఇంధన భద్రతా చర్యలు తీసుకుంటాం’ అని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా నుంచి చైనా జరుపుతున్న చమురు కొనుగోళ్లపై ట్రంప్ హెచ్చరికలు చేసినప్పటికీ ఆయన సలహాదారు పీటర్ నవర్రో మాత్రం బీజింగ్ ఎగుమతులపై కొత్తగా టారిఫ్ విధించే అవకాశాలు లేవని చెప్పారు. అధిక సుంకాలు అమెరికాకు నష్టం కలిగిస్తాయని ఆయన తెలిపారు.
చైనాపై అదనపు సుంకాలు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES