నవతెలంగాణ-హైదరాబాద్: పార్-తాపి నర్మదా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గుజరాత్లో వేలాది మంది గిరిజనులు భారీ నిరసన చేపట్టారు. ఈ ప్రాజెక్టు వల్ల తమ ఇళ్ళు, సంస్కతి, జీవనోపాధిని నాశనం చేస్తుందని.. అందుకే ఈ ప్రాజెక్టుని పూర్తిగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. తొమ్మిది డ్యాముల నిర్మాణంతో మూడు ప్రధాన నదులను అనుసంధానించే పార్-తాపి నర్మదా లింక్ ప్రాజెక్టుపై దక్షిణ గుజరాత్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
కాగా, వల్సాద్ జిల్లాకు చెందిన వేలాది మంది గిరిజనులు గురువారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. డ్యామ్ హటావో సమితి బ్యానర్ కింద ఐక్యమయ్యారు. లారీలు, ట్రాక్టర్లలో వేలాది మంది ఆదివాసీలు ధరంపూర్కు తరలివచ్చారు. పార్-తాపి నర్మదా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ప్రాజెక్ట్ వల్ల తమ ఇళ్ళు, సంస్కతి, జీవనోపాధి నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు పరిహారం వద్దని, ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు వాన్స్డా ఎమ్మెల్యే అనంత్ పటేల్, కాంగ్రెస్ నేత అమిత్ చావ్డాతో సహా స్థానిక నాయకులు గిరిజనుల నిరసనకు మద్దతు తెలిపారు. అయితే ఎలాంటి ఉద్రిక్తతకు దారితీయకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.