నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలోని వ్యాపారులు, దుకాణదారులు స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి పెట్టాలని పీఎం మోడీ అన్నారు. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో మన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తక్కువ ధర, అధిక నాణ్యత అని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆర్థిక స్వార్థం పెరుగుతోంది. మన లక్ష్యాలను చేరుకోవడానికి ముందుకుసాగాల్సిన సమయం ఇది అని మోడీ పేర్కొన్నారు. 79వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఎర్రకోటపై జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పౌరులను ఉద్దేశిస్తూ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్లిష్ట సమయంలో ప్రపంచ ఆర్థిక మార్కెట్లో మన సత్తా చాటాలని, నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో మన దేశ సామర్థ్యం నిరూపించుకోవాలని పీఎం మోడీ పిలుపునిచ్చారు.
రైతు వ్యతిరేక విధానాలను సహించేది లేదన్నారు. రైతులు మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పడతారన్న మోదీ.. అన్ని సందర్భాల్లో వారికి అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.
అణు ఇంధనంలో ప్రైవేటు పెట్టుబడులు
డీజిల్, పెట్రోల్ దిగుమతులపై రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని, కొత్త ఇంధనాల అభివృద్ధితో పెట్రోలియం దిగుమతులు తగ్గించాలనేది లక్ష్యమన్నారు. దిగుమతులు తగ్గితే స్వయంసమృద్ధి సాధ్యమని, నేడు ప్రపంచమంతా కీలక ఖనిజాల చుట్టే తిరుగుతోందన్నారు.అణుఇంధనం వైపు కూడా దేశం వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. అణు విద్యుత్లో ప్రైవేటు పెట్టుబడులను కూడా ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.