నవతెలంగాణ – హైదరాబాద్: బైక్ కోసం కన్నతండ్రినే కడతేర్చాలని చూశాడో కొడుకు.. బైక్ కొనివ్వలేదనే కోపంతో తండ్రిపై గొడ్డలితో దాడి చేశాడు. నిద్రపోతున్న తండ్రిని గొడ్డలితో నరికాడు. అడ్డొచ్చిన తల్లిపైనా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ అమానుష ఘటన ఖమ్మం జిల్లాలోని మంగళగూడెంలో ఈ నెల 14న చోటుచేసుకుంది. ఈ దాడిలో గాయపడ్డ తండ్రి ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగూడేనికి చెందిన బండారు నాగయ్య, నాగలక్ష్మి దంపతులకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు.
నాగయ్య కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చదువు మధ్యలోనే ఆపేసిన కొడుకు సతీష్ (22) జులాయిగా తిరుగుతున్నాడు. ఇటీవల తనకు సెల్ ఫోన్ కావాలని గొడవ చేయగా అప్పు చేసి కొనిచ్చామని నాగలక్ష్మి తెలిపారు. బైక్ కోసం రెండు నెలల గొడవ చేస్తుండగా.. బైక్ కొనేంత డబ్బు తమ వద్ద లేదని సర్దిచెప్పినా వినలేదన్నారు. ఏదైనా పనిచేసి బైక్ కొనుక్కోమని చెప్పగా తమపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడని వాపోయారు. ఈ నెల 13 వ తేదీలోగా బైక్ కొనవ్వకుంటే తామిద్దరినీ చంపేస్తానని కొడుకు బెదిరించాడని నాగలక్ష్మి మీడియాకు వివరించారు. ఈ క్రమంలోనే 14వ తేదీ తెల్లవారుజామున తండ్రి నాగయ్యపై సతీశ్ గొడ్డలితో దాడి చేశాడని, అడ్డుకోవడానికి వెళ్లిన తనపైనా దాడికి ప్రయత్నించాడని చెప్పారు. దీంతో తాను భయంతో అరుస్తూ బయటకు పరుగులు తీసినట్లు తెలిపారు. తన కేకలు విని చుట్టుపక్కల వారు వచ్చేసరికి కొడుకు పారిపోయాడని చెప్పారు. గొడ్డలి వేటుతో గాయపడ్డ తన భర్త నాగయ్యను ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించి కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నాగలక్ష్మి చెప్పారు.