నవతెలంగాణ-హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో మరో రెండు గేట్లను అధికారులు ఎత్తారు. మొత్తం ఐదు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టుకు 2,30,876 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. ఔట్ ఫ్లో 2,29,129 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30 వేల క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,784 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఐదు గేట్ల ద్వారా 1,33,030 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 197.91 టీఎంసీలుగా కొనసాగుతోంది.