నవతెలంగాణ – హైదరాబాద్; గుజరాత్లోని సూరత్ నగరంలో భారీ వజ్రాల చోరీ కలకలం సృష్టించింది. ప్రముఖ డైమండ్ కంపెనీ డీకే అండ్ సన్స్ కార్యాలయంలో గుర్తుతెలియని దుండగులు సుమారు రూ.25 కోట్ల విలువైన వజ్రాలను అపహరించారు. ఈ సంఘటన కపోద్రా ప్రాంతంలోని కంపెనీ ఆఫీస్ కమ్ పాలిషింగ్ యూనిట్లో ఆగస్టు 15 నుంచి 17 మధ్య చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. కంపెనీకి మూడు రోజుల పాటు సెలవులు ఉండటంతో మూసివేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న దుండగులు మొదటగా భవనంలోని కింది అంతస్తులోని ప్రధాన ద్వారం బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు.
అనంతరం మూడో అంతస్తులో ఉన్న మెటల్ సేఫ్ వద్దకు చేరుకుని, గ్యాస్ కట్టర్ సహాయంతో సేఫ్ను తెరిచి వజ్రాలను దోచుకున్నారు. చోరీ జరిగిన సమయంలో భవనంలోని సీసీటీవీ కెమెరాలు ధ్వంసం కావడం గమనార్హం. దీనివల్ల దర్యాప్తు కొంత క్లిష్టంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. కంపెనీ యజమాని సెలవుల అనంతరం సోమవారం కార్యాలయానికి వచ్చి ఈ ఘటనను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ తెలిపారు.