– చేర్యాల ఎస్ఐ వేముల నవీన్
నవతెలంగాణ-చేర్యాల : మూఢనమ్మకాలను నమ్మవద్దని చేర్యాల ఎస్ఐ వేముల నవీన్ అన్నారు.జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ సాంస్కృతిక సారధి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రాత్రి చేర్యాల పట్టణ కేంద్రంలోని కొత్త బస్టాండ్ లో కనువిప్పు కళాబృందం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నవీన్ మాట్లాడుతూ మంత్రాలు, తంత్రాలు అంటూ మూఢనమ్మకాలు నమ్మవద్దని,మూఢనమ్మకాలు నమ్మి ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని ప్రజలకు సూచించారు.ఏదైనా సమస్య ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ కు రావాలని ఇరు వర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. సీసీ కెమెరాలు 24 గంటలపాటు ప్రజలకు సెక్యూరిటీని ఇస్తాయని తెలిపారు.మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, బ్యాంకు అధికారులు అని ఫోన్ చేస్తే నమ్మవద్దని, అకౌంట్ డీటెయిల్స్ పర్సనల్ గుర్తుతెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దన్నారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని,ఆన్లైన్ గేమ్స్ ఆడి మీరు మీ కుటుంబాలను రోడ్డున పడవేయవద్దని కోరారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట పోలీస్ కళాబృందం సభ్యులు బాలు,రాజు, తిరుమల,సాంస్కృతిక సారధి టీం లీడర్ పిల్లిట్ల శ్యామ్ సుందర్,కవి, గాయకులు పిన్నింటి రత్నం,సనువాల కనకయ్య,గెంటె హరిప్రసాద్,పన్నీరు శ్రీనివాస్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.