నవతెలంగాణ కీవ్ : రష్యా బుధవారం రాత్రి సమయంలో 574 డ్రోన్లు, 40 క్షిపణులను ప్రయోగించినట్టు ఉక్రెయిన్ వైమానిక దళం గురువారం తెలిపింది. రష్యా అధికంగా దేశంలోని పశ్చిమ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుందని, ఈ దాడుల్లో ఒకరు మరణించగా, 15మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. పాశ్చాత్య మిత్ర దేశాలు అందించే సైనిక సహాయంలో ఎక్కువ భాగం ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాల్లో నిల్వ చేస్తుంటారని అన్నారు. ఈ ఏడాది ఉక్రెయిన్పై జరిపిన అతిపెద్ద వైమానిక దాడుల్లో ఇది ఒకటని అన్నారు. అధికార గణాంకాల ప్రకారం.. డ్రోన్ల సంఖ్య పరంగా ఇది ఈ ఏడాది రష్యా జరిపిన మూడవ అదిపెద్ద వైమానిక దాడి కాగా, క్షిపణుల పరంగా ఎనిమిదవ అతిపెద్ద దాడి. పశ్చిమ ఉక్రెయిన్లోని ప్రధాన అమెరికన్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థపై దాడి చేసిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా తెలిపారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడిని ఖండించారు. చర్చల అనంతరం ఎటువంటి మార్పు లేదన్నట్లు దాడి చేశారని ఆరోపించారు. యుద్ధాన్ని ముగించడానికి అర్థవంతమైన చర్చలు కొనసాగించే సంకేతాలను రష్యా చూపలేదని, కఠినమైన ఆంక్షలు, సుంకాలు సహా అధిక ఒత్తిడి కొనసాగించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరిందని ఆయన ఆరోపించారు. రష్యా అమెరికన్ వ్యాపార సంస్థపై దాడి కోసం అనేక క్షిపణులను వృధా చేసిందని అన్నారు. ఈ వ్యాపార సంస్థ కాఫీ యంత్రాల వంటి దేశీయ అవసరాలను ఉత్పత్తి చేసే సాధారణ సంస్థ అని అన్నారు.