నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు జరుపుకునే పండుగల్లో బతుకమ్మ ప్రత్యేకం. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా బతుకమ్మ పండుగ షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 22 నుంచి తెలంగాణలో బతుకమ్మ వేడుకలు జరుగనున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈనెల 27న ట్యాంక్బండ్పై బతుకమ్మ కార్నివాల్, 28న 10 వేల మందితో బతుకమ్మ సంబురాలు, 29న పీపుల్స్ ప్లాజా దగ్గర బతుకమ్మ పోటీలు, ఈనెల 30న బతుకమ్మ పరేడ్ ఉంటుందని జూపల్లి తెలిపారు. ఈసారి ప్రపంచదృష్టిని ఆకర్షించేలా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు.
తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రుల వేడుకలకు అనుగుణంగా 9 రోజుల పాటు 9 రకాల వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనుంది. అంతేకాదు.. ఈసారి బతుకమ్మ పండుగను తొలిరోజున వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయ ప్రాంగణంలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో ఈ వేడుకలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో ‘ఫ్లోటింగ్ బతుకమ్మ’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఈసారి బతుకమ్మ వేడుకల్లో సెలబ్రిటీలతోపాటు అంతర్జాతీయ ప్రముఖులను కూడా ఆహ్వానించి వారిని భాగస్వామ్యం చేయాలని.. తద్వారా బతుకమ్మ పండుగ విశేషాలను ఆయా దేశాల్లోనూ ప్రజల దృష్టికి వెళ్లేలా చేయాలని పర్యాటక శాఖ భావిస్తుంది.