నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లా సూరజ్ పూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మూడు నెలల బాలుడిని ఎత్తుకెళ్లిన కోతి.. నీటి డ్రమ్ములో పడేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి తల్లి సరిత బాలుడు శివాన్ష్ను నిద్రపుచ్చి.. మంచంపై పడుకోబెట్టి స్నానానికి వెళ్లింది. కానీ తిరిగొచ్చి చూసేసరికి పిల్లాడి జాడలేదు. తల్లి కేకలు వేయడంతో కుటుంబీకులు, స్థానికులు చేరుకోగా.. ఇంట్లో అన్ని గదులు, చుట్టుపక్కలా వెతికారు. చివరకు పిల్లాడు ఇంటిపైన నీటితో నిండిన డ్రమ్ములో తేలుతూ కనిపించాడు. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉండటంతో.. కోతి చేసిన పనే అని నిర్ధారణకు వచ్చారు గ్రామస్తులు.
కాగా ఈ గ్రామంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతుందని చెప్తున్నారు స్థానికులు. పిల్లలు, పెద్దలను గాయపరుస్తున్నాయని.. ఇళ్లలోకి ప్రవేశించి వస్తువులను ఎత్తుకెళ్తున్నాయని చెప్తున్నారు. కానీ అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవని చెప్తున్నారు. కాగా చనిపోయిన పిల్లాడు తల్లిదండ్రులకు మొదటి సంతానం కాగా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమ సంతోషాన్ని కోతి చిదిమేసిందని దు:ఖిస్తున్నారు.