నవతెలంగాణ-హైదరాబాద్ : భారీ సుంకాల విధింపు నేపథ్యంలో భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో జరగనున్న ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ప్రధాని మోడీ హాజరు కావడం లేదని తెలుస్తోంది.
సెప్టెంబరు 9 నుంచి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ ప్రారంభమవుతుంది. 23 నుంచి 29 వరకు సర్వసభ్య దేశాల ప్రతినిధుల అత్యున్నత స్థాయి సమావేశాలు జరుగుతాయి. ఇందులో బ్రెజిల్ దేశాధినేత ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. అనంతరం అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ మాట్లాడతారు. తర్వాత భారత మంత్రి ప్రసంగం ఉంటుందని ఐరాస తన షెడ్యూల్లో పేర్కొంది. దీని ప్రకారం యూఎన్ సమావేశాలకు మోడీ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రసంగించనున్నారని సమాచారం. ఇది తుది షెడ్యూల్ కానందున సమావేశాల ప్రారంభానికి ముందు కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాధినేతలు కూడా సమావేశాల్లో ప్రసంగించనున్నారు.
ట్రంప్ ఇటీవల భారత్పై 50 శాతం సుంకాలు విధించారు. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో మోడీ యూఎన్ సమావేశాలకు కూడా దూరం కానుండటం గమనార్హం.